గతేడాది ఆరంభంలో ‘అల..వైకుంఠపురములో…’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్ని). ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు బన్ని. ఇది తన కెరీర్లో 20వ చిత్రం. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో బన్నీ మాస్, రఫ్ లుక్లో విభిన్నంగా కనిపించనున్నారు. అంతేకాకుండా ‘పుష్ప’ కోసం ఆయన చిత్తూరు మాండలికాన్ని నేర్చుకున్నారు.
ఇదిలాఉంటే.. 2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. ఆ తర్వాత ‘ఆర్య’, ‘దేశముదురు’, ‘పరుగు’, జులాయి, రేసుగుర్రం, సరైనోడు’ వంటి బ్లాక్బస్టర్ హిట్స్తో ఇండస్ట్రీలో తనదైన ప్రతిభను చాటుకున్నారు. అయితే నేటికీ ‘గంగోత్రి’ సినిమా విడుదలై 18 సంత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. “నా తొలి సినిమా విడుదలై నేటికి 18 ఏళ్లవుతుంది. నా 18 ఏళ్ల ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నాను. నా హృదయమంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఇన్నేళ్లు నాపై ప్రేమను కురిపించినందుకు నేను అదృష్టవంతుడిని. మీ ఆశీర్వాదాలు అందించింనందుకు థాంక్స్” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.