అక్కినేని నాగార్జున కథానాయకుడిగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్ 2)న విడుదలై మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజయ్ వర్మగా దుమ్మురేపాడు. గత రెండేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కింగ్ నాగ్.. ‘వైల్డ్ డాగ్’తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూశాడు. అనుకున్నట్లే తొలి నుంచే ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి వైల్డ్ డాగ్ స్పెషల్ షో చూసిన తర్వాత చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. “ఇప్పుడే వైల్డ్ డాగ్ చూసాను. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుక ఉన్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆ ఆవేశాన్ని ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా చూపించారు. వైల్డ్ డాగ్ టీంని దర్శకుడు సోలొమన్.. నిర్మాత నిరంజన్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లోఒకటి కాదు..ప్రతి ఒక్క భారతీయుడు తెలుగు వారు గర్వంగా చూడవల్సిన చిత్రం.. డోంట్ మిస్ దిస్ వైల్డ్ డాగ్ ” అని చిరు ట్వీట్ చేశారు.